నిత్యజీవితంలో మనం ఆచరించాల్సిన విషయాలు.


1. తల్లిదండ్రులను పూజించాలి. ఏ స్థితిలోనూ దూషించరాదు.
2. మంత్రోపదేశం చేసినవారు మాత్రమే గురువు. (తక్కిన విద్యలు నేర్పినవారు అధ్యాపకులు మాత్రమే) అట్టి గురువును ఏ పరిస్థితిలోనూ నిందించరాదు. ఆయన ఎదురుగా కాళ్ళుచూపి కూర్చోరాదు.
3. భోజనం తూర్పు, ఉత్తర దిక్కులవైపు కూర్చొని చేయాలి.
4. నడుస్తూ కాని, నిలబడి కాని మలమూత్రాదులు విడువరాదు.
5. బట్టలు ధరించకుండా నదులలో స్నానం చేయరాదు.
6. దేవాలయాల్లోనూ, గోశాలలోను మలమూత్రాదులు విడువరాదు.
7. మలమూత్ర విసర్జన ఉత్తర, దక్షిణ దిశలుగా మాత్రమే చేయాలి.
8. తూర్పు, దక్షిణ దిక్కుల తల పెట్టి నిద్రపోవాలి, ఉత్తర, పశ్చిమాల వైపు తల పెట్టి నిద్రిస్తే వారు ప్రమాదాల పాలౌతారని మార్కండేయ పురాణం చెబుతుంది.
9. ఇంటికి గురువు వస్తే టక్కున లేచి నిలబడి ఎదురుగావెళ్ళి లోపలికి గౌరవంగా తీసుకొని వచ్చి ఆసనం వేసి కూర్చోబెట్టకుండా మాట్లాడరాదు. సాగనంపేటపుడు బయటకు వచ్చి గురువుని కొంచెం దూరం అనుసరించాలి.
10. పైన అనగా భుజాలమీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు, భోజనం చేయకూడదు.
11. రెండు చేతులతో ఎప్పుడూ తల గోక్కోరాదు.
12. గురుపాపం ఎవరికీ చెప్పరాదు. గురువునకు కోపం వస్తే తక్షణం ప్రసన్నం చేసుకోవాలి.
13. ఇతరుల చెప్పులు, వస్త్రాలు ధరించకూడదు.
14. చతుర్దశి, అష్టమి దినాలలో తలంటు పనికిరాదు. స్త్రీ సంగమం పనికిరాదు.
15. అన్నము తిన్నాక కంచంలో చేయి కడుక్కోరాదు. చేయి కడిగిన తరువాత ఆ చేతిని విదల్చరాదు.
16. గురువు కోరితే ఏదైనా ఇమ్మని శాస్త్ర వచనం. అటువంటి గురువును ఏ పరిస్థితిలోను అసహ్యించుకొనరాదు. 10వేల యజ్ఞాల ఫలితం కూడా ఈ ఒక్క కార్యంతో నశించిపోతుంది. కనుక గురుధిక్కారం పనికిరాదు.
17. పిసినిగొట్టుతో, శత్రువుతో, అసత్యం పలికే వాడితో భర్తను తిట్టే స్త్రీతో కలిసి భోజనం చేయటం మహాపాపం.
18. స్నానం చేయకుండా అన్నం వండరాదు. ఆ అన్నం తినరాదు.
19. నోటితో అగ్నిని ఆర్పరాదు, ఊదరాదు.
20. పురాణాలు చెప్పే వ్యక్తి సర్వోత్తముడు. అటువంటి వారిని నిందించరాదు.
21. పుణ్య కార్యాల్లో చోళ్ళు, జొన్నలు, వెల్లుల్లి, ఉల్లి, చద్ది పదార్థాలు తినరాదు, ఉపయోగించరాదు.
22. ప్రయాణం మధ్యలో భోజనాదులకు నియమంలేదు.
23. తడిసిన బట్టల నీళ్ళు ఇతరులపై పడేట్లు విదిలించరాదు.
24. ఎట్టి పరిస్థితులలోను ఆత్మహత్య చేసుకోరాదు. అలా చేసుకున్నవారు కొన్ని వేల జన్మలు పిశాచ జన్మలెత్తి వికలాంగులై పుడతారు.
25. తెలిసినవారి మరణ వార్త విన్న వెంటనే గాని, పురిటి వార్త విన్న వెంటనే గాని కట్టుబట్టలతో స్నానం చేయాలి.
26. పుష్కర స్నానాదులలో చొక్కాతో స్నానం చేయరాదు. కండువా మాత్రమే ఉండవలెను.
27. ఏకాదశి నాడు ఎన్ని అన్నంమెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్లు లెక్క అని శాస్త్ర వచనం. కావున అన్నం భిన్నం చేసుకొని తినాలి. ఒక్క నిర్జలైకాదశి అనగా జేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు మాత్రం ఫలహారం కూడా పనికి రాదు. 60 సం.లు దాటిన వారికి, 11 సం.లు లోపు వారికి ఈ నియమం వర్తించదు. అనారోగ్య వంతులకు ఈ పై నియమాలు లేవు.
28. కూర్చొని తొడలు, కాళ్ళు ఊపరాదు. అలా ఊపినవాడు వచ్చే జన్మలో కుంటివాడై పుడతాడు.
29. తూర్పు, ఉత్తరముఖంగా దంతధావనం చేయాలి. పడమర, దక్షిణ దిక్కుగా నిలబడి చేయకూడదు.
30. ఉమ్ము మాత్రం తూర్పు, పడమరగా వేయరాదు.

ఆఫీసుకు లక్ష్మీకళ రావాలంటే..?

సాధారణంగా గృహానికి సంపూర్ణ వాస్తు ఉంటే సరిపోతుందనుకుంటారు. అయితే ఆఫీసుకు కూడా వాస్తు అవసరమన్న విషయం తెలుసుకోవాలి. ఉద్యోగులు పనిచేసే ఆఫీసులు లక్ష్మీకళతో కళకళలాడుతుండాలంటే కళ్లు చెదిరే విపరీతమైన లైట్లు, తళతళలాడే అత్యాధునిక విదేశీ ఫర్నిచర్ ఉండగానే సరిపోదు. ఆ ఆఫీసుల్లో వాస్తు శాస్త్ర ప్రకారం దిశాదిశలు, సరైన దిశలో పెట్టాల్సిన బరువైన వస్తువులు, తీసేయాల్సిన అనవసర వస్తువులు ఇలా చాలా చాలా ఉంటాయి. వీటన్నిటినీ సరిగా నిర్దేశించిన స్థలాల్లో వాస్తు ప్రకారం ఉంచితే ఆయా ఆఫీసులు బాగా అభివృద్ధి చెందుతాయి
వస్తువులు ఏ దిశగానైనా అమరిస్తే ఏమిటి? ఏ దిక్కుకైనా కూర్చుంటే ఏమిటి? అని అనుభవం ఉన్న వారు ప్రశ్నలు వేస్తుంటారు. వీటిని పట్టించుకోకూడదు. ఆఫీసు తూర్పుకేసి ఉంటే ఫ్లోరింగ్ పశ్చిమం నుంచి తూర్పుకేసి గానీ దక్షిణం నుంచి ఉత్తరానికి గానీ ఉండాలి. తూర్పువైపు తాకకుండా గోడకు తాకకుండా ఆగ్నేయంలో దక్షిణ దిక్కుకు ఆనుకొని ఆఫీసు బాసు కూర్చోవాలి. బాసు ఉత్తర దిక్కుకేసి కూర్చోవాలి. గల్లాపెట్టె లేక అలమారు తన ఎడం వైపు పెట్టుకోవాలి.
ఒకవేళ బాసు తూర్పున అదే దిక్కుకేసి కూర్చుంటే గల్లాపెట్టె లేక అలమారు కుడిచేతివైపు పెట్టుకోవాలి. ఈ దిక్కున ఎలాంటి రణగొణధ్వని ఉండకూడదు. ఆఫీసు విషయంలో వాస్తు పాటించినట్లయితే ఆఫీసు పనులు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులు సమర్థవంతంగా ఫలప్రదంగా పనిచేస్తారు. వారు ఆఫీసుకు ఉపయోగపడేవారని, భారం కారనీ రుజువు చేస్తారు. ఆఫీసుకు తగిన చోటు, ఆకృతి, ఏటవాలు తదితరమైనవి, ఆఫీసులో వివిధ విభాగాలు, రిసెప్షన్ ఉన్న దిక్కులు వివిధ ఎలక్ట్రానిక్ పరికరాల అమరిక ఇలా ఎన్నో అంశాలను ఆఫీసుకు సంబంధించిన వాస్తు సూత్రాలు పరిగణనలోకి తీసుకుంటాయి. చక్కగా అలంకరించిన ప్రవేశం, సున్నితమైన సంగీతం వినిపిస్తూ ఉంటే కస్టమర్లను ఆకర్షిస్తుంది. ఇవి వాస్తుకంటే ప్రాధాన్యం ఉన్న విషయాలు.
ఇటీవల కూడా కార్పోరేట్ ఆఫీసులు, బ్యాంకులు ఇలాంటి మెళకువలను పాటిస్తున్నాయి. అవసరంలేని సామగ్రి అక్కర్లేని కుర్చీలు బల్లలు, అపరిశుభ్రమైన చీకటి, ఇరుకుగా ఉండే ప్రవేశం వ్యాపారానికి చెడు చేస్తాయి. కస్టమర్లు, స్నేహితులు, లాభాలు, అవసమైన వారు దూరమవుతారు. ఒక ఎక్వేరియం లేక ఫౌంటెన్ ఉంటే కస్టమర్లను అతిథులను శాంతపరుస్తుంది. ప్రధాన ద్వారం ఇరుకైన దానికంటే విశాలమైనదిగా ఉండడం మంచిది. బాగా నగిషీ చెక్కిన పాతకాలపు చెక్కతలుపు ఉంటే ఎంతో హుందాగా గౌరవప్రదంగా ఉంటుంది. స్థిరత్వాన్ని సూచిస్తుంది. వ్యాపారం మెరుగుపడుతుంది. పాతదైపోయి ఏవగింపుపుట్టించే తలుపు, అందులోనూ నాబ్ లేనిది, సరిగా తెరుచుకోనిది వెంటనే మరమ్మత్తులు చేయించాలి. ప్రవేశం వద్ద విండ్ చైమ్, వినాయకుడిని ఉంచితే సానుకూలమైన శక్తి పెంపొందుతుంది.
పనికి సంబంధించిన ఒత్తిడి తగ్గుతుంది. అడ్డంకులు జొరబడేవారి నుంచి విముక్తి కలుగుతుంది. ఒకసారి వచ్చిన కస్టమర్లు మళ్ళీమళ్ళీ వస్తారు. శబ్దాలు చేసే తలుపులు కిటికీలు ఉండకూడదు. ఒకవేళ అలాంటివి కంటపడితే వెంటనే తైలం వేసి శబ్దం చేయకుండా జాగ్రత్త తీసుకోండి. ఆఫీసులో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొల్పండి. ఇది అత్యంత ప్రధానమైంది. సరైన వెలుతురు, తాజా పూలు, సుకుమారమైన రంగులు, అందమైన అలంకరణ, శబ్దం రానీయని ఫ్లోరింగ్, సన్నగా వినవచ్చే సంగీతం వినియోగించి ఆశించిన శాంత వాతావరణాన్ని సృష్టించండి. కంపెనీకి సంబంధించిన ఉత్పత్తులు, వాటి ఫోటోలు, లేక మీ సేవలను వివరించే బ్రోచర్లు లాబీలో ప్రదర్శించండి. ఫోకస్ ఉన్న లైట్ల వెలుగులో వీటిని ఉంచాలి.
రిసెప్షన్లోకి అడుగుపెట్టగానే కస్టమర్ వీటివైపు ఆకర్షితుడవ్వాలి. రిసెప్షన్ను ఈశాన్యం దిక్కుగా అమర్చండి. కానీ ఆఫీసులో ఈశాన్యం మూలను మాత్రం దేవతా విగ్రహానికి కేటాయించండి. ఏమీ లేకపోతే లైట్లతో పూలతో అలంకరించడండి. ఆఫీసు ఈశాన్యం మూల అతిథి గదులు ఉండకూడదు. అలా వున్నట్లయితే ప్రమాదకర పరిణామాలు తలెత్తుతాయి. నిజజీవితంలో ఉద్యోగ రంగంలో ఎదుగుదలను సంతోషాన్ని అడ్డుకుంటుంది. ఆఫీసు చైర్మన్ లేక నరల్ మేనేజర్ గది నైరుతిలోగానీ దక్షిణ భాగంలో గానీ ఉండాలి.
అతడు ఆఫీసు నైరుతి మూలన తూర్పుకేసి కూర్చోవడం మంచిది. బాస్ నైరుతి మూలన బరువైన సేఫ్టీ లార్ ఉంచడం మంచిది. ఇందులో ముఖ్యమైన పత్రాలు కంపెనీ స్థిరచిరాస్తులకు సంబంధించిన పత్రాలు ఉంచాలి. ఈ సేఫ్ను గోడలోనే అమర్చడం మంచిది. అలాగే ఇతరులు చూడవలసి ఫైళ్ళు ఉంచడానికి గదిలో వాయువ్య దిశగా కొంత జాగా వుంచండి. మధ్యస్థాయి సిబ్బందిని ఉత్తరాన కానీ తూర్పున గానీ కూర్చునే ఏర్పాటు చేయాలి. ఆఫీసులో కేంద్ర ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచేందుకు కృషిచేయాలి. ఈచోటును ఖాళీగా ఉంచి నేలపై పూల మోటిఫ్ను గానీ ఓ కళాకృతినిగానీ పెట్టండి. లేక ఓ దేవతావిగ్రాహాన్ని ఉంచండి. చోటు శుభ్రంగా ఉంటుంది.
నిప్పు లేక వేడిపుట్టించే పరికరాలను ఆగ్నేయం మూల వుంచాలి. జెనరేటర్లు, ఇన్వర్టర్లు, ఎలక్ట్రిక్ మీటర్, మెయిన్ కరెంటు స్విచ్చు, కంప్యూటర్ సర్వర్లు, ఆఫీసు టీ గది ఆగ్నేయం మూల నుంచాలి. ఎవ్వరూ దూలం కింద కూర్చోకుండా జాగ్రత్త తీసుకోవాలి. అలా ఉన్నట్లయితే పనిచేసే టేబులును మరోచోటికి తర లించండి. ఈ నియమం కంప్యూటర్లకు ఇతర ఆఫీసు పరికరాలకు కూడా వర్తిస్తుంది. పార్కింగ్, టాయిలెట్లకు, గిడ్డంగుకు, కస్టమర్లు కూర్చోడానికి చోటు, మెట్లు, లిఫ్టులు, వెలుపల పరిసరాలు, బిల్డింగ్ ప్రధాన ప్రవేశ ద్వారం ఇలా ప్రతి అంశానికి నిర్దిష్టమైన నియమాలున్నాయి.
ఆఫీసులో ఫ్లోరింగ్ తూర్పువైపునకుగాని, ఉత్తరంవైపుకుగాని, ఈశాన్యం వైపునకుగాని కాస్తంత స్లోప్గా వుండాలి. ఈ స్లోప్ ఆఫీసు ప్రధాన ద్వారంవైపు ఉండకూడదు. ఇలా పొరపాటున ఉంటే ఆఫీసుకు వ్యాపారంలో రావాల్సిన లాభాలు రావు. ఆఫీసు బిల్డింగ్ ఎత్తులో అన్ని దిక్కులు సరిసమానంగా ఉండాలి. తూర్పు ఎత్తుగా, ఉత్తరం ఎత్తుగా వుంటే ఆ ఆఫీసులో దరిద్రం తాండవిస్తుంటుంది. లాభాలు నష్టాలతో కలిసిపోతుంటాయి. అనారోగ్య వాతావరణంలా వున్న ఆఫీస్ కళ మారాలంటే నీటి బానల్లో పుష్పాలను వేసి ఈశాన్య దిశగా ఉంచండి. కాని ప్రతిరోజు వాటిలో నీరుని, పుష్పాలను క్రమం తప్పక మార్చాలి.
నెలకొకసారి ఆఫీసు సింహద్వారానికి బూడిద గుమ్మడి కాయ ఎర్రని రంగు వస్త్రంలో వేలాడదీయడం మంచిది. మతాలను బట్టి కనీసం వారానికి ఒకసారన్నా సాంబ్రాణి ధూపం ఆఫీసు అంతా వేయండి. నరదృష్టి తొలిగిపోతుంది.

సమస్యలు పరిహార క్రియలు


కొన్ని పరిహార క్రియలు పాటించడం ద్వారా మన కున్న సమస్యలను పోగొట్టుకోవచ్చు. అటువంటి వి కొన్ని మీకోసం.

శత్రువులు ఆటంకాలు కలిగిస్తూ ఉంటే, వారి చేస్తున్న ఆటంకాలను అధిగమించాలంటే జమ్మి చెట్టు దగ్గర మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి దీపాన్ని వెలిగించాలి.

తరచూ అనారోగ్యాలు కలుగుతుంటే రావి చెట్టు మొదల్లో తూర్పు దిక్కుగా దీపం వెలిగే విధంగా 44 రోజులు మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి సమపాళ్ళలో పోసి, దీపం వెలిగించాలి.

పితృదేవతలు శాంతించేందుకు మేడి చెట్టు మొదల్లో తూర్పు దిక్కుగా దీపం వెలిగే విధంగా 44 రోజులు మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె, ఆముదం, వేపనూనె, ఇప్పనూనె, ఆవునెయ్యి సమపాళ్ళలో పోసి, దీపం వెలిగించాలి.


ప్రతిరోజు రావిచెట్టు దగ్గర ఉండే జంటనాగుల దగ్గర బియ్యపు పిండితో ముగ్గు పెట్టి, మట్టిప్రమిదలో నువ్వుల నూనె గానీ, ఆవునెయ్యి గానీ పోసి, దీపారాధన చేసి, 27 ప్రదక్షిణలు చేయాలి. ఇలా కొంత కాలం చేస్తూ ఉంటే స్త్రీ సంబంధిత వ్యాధులు తగ్గుతాయి.


విపరీతమైన కోపం తగ్గడానికి ఆదివారం రోజున నవగ్రహాల్లో ఉండే సూర్యుని దగ్గర దీపం పెట్టాలి. దీపం తూర్పు వైపు చూసే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అనంతరం సూర్యుని విగ్రహం చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. దీని వల్ల విపరీతమైన కోపం తగ్గుతుంది.


భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి జంట నాగుల దగ్గర నిమ్మడొప్పల్లో నువ్వుల నూనె పోసి, తూర్పు ముఖంగా వెలిగే విధంగా 25 ఆదివారాలు దీపారాధన చేయాలి. దీని వల్ల భార్య భర్తల మధ్య గొడవలు సమసిపోయి, తిరిగి ఏ విధమైన గొడవలు రాకుండా ఉంటాయి.

ZeeTelugu OMkaram Yogam Kshemam 29th Dec 2015